ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్పంగా లాభాలు గడించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లోని లిస్టెడ్ కంపెనీల్లో టాప్-5 కంపెనీలు రూ.1.01 లక్షల కోట్ల మేరకు లాభ పడ్డాయి. వీటిల్లో దేశీయ ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ 374.71 (0.71%) పాయింట్లు లాభ పడింది.
టీసీఎస్ ఎం-క్యాప్ ఇలా రూ.47,551 కోట్లు పెరుగుదల
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.47,551.31 కోట్లు పెరిగింది. దీంతో కంపెనీ ఎం-క్యాప్ రూ.12 లక్షల కోట్లు దాటి, రూ.12.10 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ఈ టాప్ గెయినర్లలో టీసీఎస్ అత్యధికంగా లబ్ధి పొందింది.
మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ కూడా రూ.26,227.28 కోట్లు పెరిగి రూ.6.16 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,200.35 కోట్లు పెరిగి, రూ.14.02 లక్షల కోట్లకు చేరుకున్నది.
రూ. 5.5 లక్షల కోట్లు దాటిన హెచ్యూఎల్ ఎం-క్యాప్
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,850.48 కోట్లు పెరిగి రూ.5.56 లక్షల కోట్లను దాటింది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.7,560.02 కోట్లు పెంచుకుంది. ప్రస్తుతం దాని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.69 లక్షల కోట్లకు చేరింది.
ఇలా తగ్గిన హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్
ఇక హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,968.39 కోట్లు తగ్గింది. దీంతో ఈ సంస్థ మొత్తం ఎం-క్యాప్ రూ.4,61,972.21 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,249.47 కోట్లు పతనమై రూ.8.20 లక్షల కోట్ల వద్ద నిలిచింది.
పతనం బాటలోనే ఐసీఐసీఐ తదితర స్క్రిప్ట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ సైతం రూ.4,927.52 కోట్లు తగ్గి రూ.4.40 లక్షల కోట్లకు దిగి వచ్చింది. ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,614.47 కోట్లు తగ్గి రూ.3.83 లక్షల కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎం-క్యాప్ రూ.2,924.02 కోట్లు పతనమై రూ.3.55 లక్షల కోట్లకు పరిమితమైంది.
టాప్లోనే రిలయన్స్
మార్కెట్ క్యాపిటలైజేషన్లో బీఎస్ఈ-10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.