కామారెడ్డి/విద్యానగర్, మే 11: కరోనా సెకండ్వేవ్ జనాలను కలవరపెడుతున్నది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలువురు మృతిచెందడం వ్యాపారులను లాక్డౌన్ వైపు మళ్లించింది. బంగారు, వెండి ఆభరణాల దుకాణాలను ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు స్వచ్ఛందంగా మూసి ఉంచాలని నిర్ణయించారు. దీనికితోడు కిరాణా వర్తకులు సైతం దుకాణాలను మంగళవారం నుంచి మూసి ఉంచాలని తీర్మానించారు. ఈ నెల 16 తేదీ వరకు పూర్తిబంద్ పాటించాలని అసోసియేషన్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బంగారం వ్యాపారులు ఈ నెల 20 వరకు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నది. లాక్డౌన్తో జనసంచారం తగ్గిపోయి కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
కరోనాతో చాలా మంది హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటుండగా మరికొంత మంది దవాఖానల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వ్యాపార సంస్థలు, వ్యాపారులు వ్యక్తిగతంగా తమ సంస్థలను మూసి ఉంచారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వైద్యబృందాలు ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నాయి. దీనికి తోడు జనసంచారాన్ని నియంత్రించడంతో వైరస్ వ్యాప్తిని మరింత కట్టడి చేయవచ్చని, కేసుల సంఖ్య కూడా తగ్గుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కాగా నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి పరిమిత వేళలు ఉండడంతో ముందుగానే కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లు, ఇతర వ్యాపార సంస్థల వద్ద జనం బారులు తీరి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.
పలు గ్రామాల్లో..
గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్, మే 11: మండల కేంద్రంలో మంగళవారం సైతం పాక్షిక లాక్డౌన్ కొనసాగింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దుకాణాలు, హోటళ్లను తెరిచి ఉంచారు. కిరాణా దుకాణాలు, హోటళ్ల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. బీబీపేట్ మండలకేంద్రంతోపాటు మాందాపూర్ గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.కిరాణా దుకాణాలను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచారు. దవాఖానలు, మెడికల్ షాపులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. వ్యాపారులు మధ్యాహ్నం 2 గంటలకే దుకాణాలు బంద్ చేయడంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాండూర్, ఆత్మకూర్, బొల్లారం, పోచారం గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది.