ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్గా జీతూ జోసెఫ్ దృశ్యం 2 అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న అమెజాన్లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. సామాన్యులు, సెలబ్రిటీలు దృశ్యం 2 సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కథను అద్భుతంగా నడిపిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చింది. ఈ క్రమంలో రాజమౌళి తన వాట్సాప్ ద్వారా జీతూ జోసెఫ్కు మెసేజ్ పంపి చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
రాజమౌళి పంపిన వాట్సాప్ మెసేజ్ను దర్శకుడు జీతూ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. మీ ప్రశంసలకు ధన్యవాదాలు రాజమౌళి గారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించారు అని జీతూ కామెంట్ కూడా పెట్టాడు. అయితే రాజమౌళి పంపిన మెసేజ్లో ఏముంది అంటే.. దృశ్యం 2 సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూశాక నా ఆలోచనలు అన్ని ఆ సినిమా చుట్టే తిరిగాయి. డైరెక్షన్, స్క్రీన్ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్ ఇలా ప్రతీ విభాగం అద్భుతం . దృశ్యం 2 సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించారు. మీ దగ్గర నుండి ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను అని జక్కన్న అన్నారు. కాగా, దృశ్యం 2 చిత్రాన్ని వెంకటేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.