హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): పసివాడి ప్రాణాలు కాపాడేందుకు 65 వేల 400 మంది దాతలు ముందుకు వచ్చారు. రూ.16 కోట్ల క్రౌడ్ ఫండింగ్ సమకూర్చారు. ఈ ఫండ్తో నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖాన వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన ‘జోల్గెన్స్మాన్’ అనే ఖరీదైన ఔషధంతో చిన్నారికి చికిత్స చేసిప్రాణాలు నిలిపారు. శనివారం సికింద్రాబాద్ కార్ఖానాలోని రెయిన్బో చిల్డ్రన్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేశ్ కొనంకి వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన యోగేశ్ గుప్తా, రూపన్గుప్తా దంపతుల కుమారుడైన అయాన్జ్గుప్తాకు అరుదైన వ్యాధి సోకింది. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరాలజిస్టు డాక్టర్ రమేశ్ కొనంకి నేతృత్వంలో వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడు అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రొఫి’ (ఎస్ఎంఏ) అనే జన్యులోపంతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఈ అరుదైన వ్యాధి చికిత్సకు అమెరికాలో దొరికే రూ.22 కోట్ల విలువైన ‘జోల్గెన్స్మాన్’ అనే ఇంజెక్షన్ ఇవ్వడం ఒక్కటే మార్గమని వైద్యులు బాలుని తల్లిదండ్రులకు వివరించారు. దాంతో వారు స్నేహితుల సహాయంతో ‘క్యూర్ ఎస్ఎంఏ’ ఫౌండేషన్ను ఆశ్రయించారు. ‘ఇంపాక్ట్ గురు.కామ్’లో అయాన్ష్కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు, వైద్యానికి అవసరమయ్యే మెడికల్ ఎస్టిమేషన్ లెటర్ను అప్లోడ్ చేశారు. ఇంపాక్ట్ గురు.కామ్ నిర్వాహకులు అయాన్ష్ అనారోగ్యం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి చికిత్సకు అవసరమయ్యే రూ.22 కోట్ల నిధుల సేకరణకు గత ఫిబ్రవరి 4న క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించగా 22 మేలో సగం నిధులు ప్రపంచవ్యాప్తంగా దాతల నుంచి అందాయి. అందులో ఒక దాత రూ.54 లక్షలు విరాళంగా ఇచ్చాడు. జూన్ 9న ఇంజెక్షన్ అమెరికా నుంచి నగరానికి చేరుకోవడంతో అదేరోజు బాలుడికి ఇచ్చారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.