హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): మన ఊరు – మన బడి, ఇంగ్లిష్ మీడియం చదువులతో ఈ ఏడాది వేలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి సర్కారు బడి బాట పట్టారు. ఇప్పటివరకు 61,129 మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి సర్కారు స్కూళ్లల్లో చేరారు. మొత్తంగా ఈ సంవత్సరం 1,69,280 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారని అధికారులు తెలిపారు. సర్కారు బడుల్లో నమోదును పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఏటా 6 -10 రోజులు మాత్రమే బడిబాట నిర్వహించగా, ఈ ఏడాది నెలపాటు నిర్వహించారు. బడిబాట కార్యక్రమం ముగిసినా సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు తీసుకొంటామని అధికారులు తెలిపారు. సర్కారు బడుల్లో చేరాలనుకొనేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రీ ప్రైమరీ క్లాసులు 2,846
ఒకటో తరగతి 1,15,428
2 నుంచి 12వ తరగతి వరకు 51, 006
మొత్తం 1,69,280