హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉత్తరభాగానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్- నాగపూర్ జాతీయరహదారిపై ట్రాఫిక్జామ్లకు చెక్ పడనున్నది. ఈ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. వెంటనే డీపీఆర్లు రూపొందించి కేంద్రానికి పంపించాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ, జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులతో కలిసి బోయిన్పల్లి నుంచి మేడ్చల్ చౌరస్తా (కాళ్లకల్) వరకు 27 కిలోమీటర్ల పొడవున ఆరులేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. మధ్యలో నాలుగు భారీఫ్లైఓవర్లు, నాలుగు అండర్పాస్లతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. సుచిత్ర జంక్షన్, డెయిరీఫామ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్, మేడ్చల్ టౌన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో సుచిత్ర నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కిలోమీటర్ల దూరంలో మూడు ఎలివేటెడ్ కారిడార్లు, నాలుగు అండర్పాస్లు, సర్వీస్రోడ్లు, జంక్షన్ల విస్తరణ జరుగుతుంది. ఇందులో సుచిత్ర వద్ద 2 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్, డెయిరీ ఫామ్ జంక్షన్ వద్ద 600 మీటర్లు, దూలపల్లి వద్ద కిలోమీటర్ మీటర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. అలాగే అండర్పాస్ల నిర్మాణం చేపడతారు. గుండ్లపోచంపల్లి నుంచి కాళ్లకల్ వరకు 17 కిలోమీటర్లు సర్వీస్రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మేడ్చల్లో రెండున్నర కిలోమీటర్ల భారీఫైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఇటీవల కేంద్ర ఉపరితల రవాణ మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది.
రూ.1,250 కోట్లు అంచనా
నాలుగు భారీ ఫ్లైఓవర్లతో ఆరులేన్ల వరకు జాతీయ రహదారిని సుచిత్ర నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు రూ.450 కోట్లు, గుండ్లపోచంపల్లి నుంచి కాళ్లకల్ వరకు 17 కిలోమీటర్ల మేర సర్వీస్రోడ్లు, జంక్షన్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, భూసేకరణ కోసం రూ.800 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. 27 కిలోమీటర్లు విస్తరించడానికి దాదాపు రూ.1,250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. జాతీయ ఉపరితలరవాణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి రాగానే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపడతారు.