హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్హెచ్జీ) ఇస్తున్న రుణాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలచేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. కొత్తగా ఏర్పాటైన ఎస్హెచ్జీలు ‘పంచసూత్రాలు’ అనుసరించి 6 నెలలు క్రమం తప్పకుండా పొదుపులు కడితే రూ.లక్ష వరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతకుముందు ఇది రూ.50 వేలు మాత్రమే ఉండేది. ఇటీవల కొత్త గ్రూపులు ఏర్పాటైన నేపథ్యంలో రుణం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 3 ఏండ్లు పూర్తిచేసుకున్న గ్రూపులకు రూ.6 లక్షలకు తగ్గకుండా గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నది. తొలి ఏడాది తీసుకున్న లోన్ కట్టే విధానం బాగుంటే రెండో ఏడాది రూ.2 లక్షలు, మూడో ఏడాది నుంచి రూ.6 లక్షలకు మించి రుణం తీసుకోవచ్చు. ఇలా రూ.10 లక్షల వరకు ఎలాంటి తనఖా లేకుండా పొందవచ్చని స్పష్టంచేసింది. తీసుకున్న రుణంలో ఎంత తిరిగి చెల్లిస్తారో, ఆ మొత్తం కావాలంటే మళ్లీ రుణంగా పొందే వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు రూ.6 లక్షల రుణం తీసుకొని కొన్ని రోజులకు రూ.లక్ష తిరిగి చెల్లించాం. అప్పుడు కావాలంటే మళ్లీ రూ.లక్ష రుణం తీసుకోవచ్చు. గతంలో తీసుకున్న మొత్తం కడితేనే రుణం ఇచ్చేవారు. ఆ నిబంధనను గత ఏడాది మార్చిన సెర్ప్, ఇకపై కూడా దానినే కొనసాగించాలని నిర్ణయించింది. రుణ జారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ మేరకు సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.