జూలై 8న మత్స్యకారుల సమస్యలపై సమావేశం
సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు త్వరలో రూ.6 లక్షల బీమా పథకం అమలు చేస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఇందుకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మరణించిన 116 మంది మత్స్యకారులకు రూ.2 లక్షల చొప్పున త్వరలోనే ఇన్స్యూరెన్స్ బకాయిలను చెల్లిస్తామని తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై జూలై 8న గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన మత్య్సకారులకు సభ్యత్వం, నూతన జిల్లాలు, గ్రామ పంచాయతీల ఆధారంగా కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.