టీకాలు సరఫరా చేయాలని మోడెర్నా సంస్థకు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రతిపాదనను ఆ సంస్థ నిరాకరించింది. తమ కంపెనీ పాలసీ ప్రకారం టీకా విక్రయాల లావాదేవీలు, పంపిణీ గురించి భారత ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని సమాధానమిచ్చింది.
-పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
వ్యాక్సిన్ డోసులను నేరుగా ఢిల్లీ సర్కార్కు పంపిణీ చేయాలని కోరాం. ఈ అభ్యర్థనను ఫైజర్, మోడెర్నా కంపెనీలు నిరాకరించాయి. తాము నేరుగా భారత ప్రభుత్వానికే టీకా అమ్మకాలు జరుపుతామన్నాయి. చేతులు జోడించి కేంద్రప్రభుత్వాన్ని వేడుకొంటున్నా. టీకా తయారీ కంపెనీలతో మాట్లాడి వ్యాక్సిన్ను దిగుమతి చేసుకొని.. రాష్ర్టాలకు సరఫరా చేయండి.
-ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
వ్యాక్సిన్ డోసుల కొరతను తీర్చడానికి రాష్ర్టాలు వేర్వేరుగా గ్లోబల్ టెండర్లకు వెళ్తే.. డిమాండ్, పోటీతత్వం పెరిగి టీకా ధరలు పెరిగే ప్రమాదమున్నది. దీనికి బదులుగా కేంద్రమే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి, టీకా డోసులను సేకరించాలి. దీంతో వ్యాక్సిన్ ధరలు దిగివస్తాయి. రాష్ర్టాలకు కేంద్రమే ఉచితంగా టీకాలను పంపిణీ చేయాలి.
-కేరళ సీఎం పినరాయి విజయన్
న్యూఢిల్లీ, మే 24: దేశంలో కరోనాను కట్టడి చేయడానికిగాను వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ర్టాలు భావిస్తున్నప్పటికీ.. అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. దేశంలో టీకాల కొరత నెలకొన్న నేపథ్యంలో విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్ డోసులను కొనాలని తెలంగాణ సహా పలు రాష్ర్టాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గ్లోబల్ టెండ్లర్లను కూడా ఆహ్వానించాయి. అయితే, రాష్ర్టాల ప్రతిపాదనలపై వ్యాక్సిన్ కంపెనీలు సానుకూలంగా స్పందించటం లేదు. తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికే టీకాలను అమ్ముతామని, రాష్ట్ర ప్రభుత్వాలతో బిజినెస్ పెట్టుకోబోమని చెబుతున్నట్టు సమాచారం. పంజాబ్లో వ్యాక్సినేషన్ కోసం సీఎం అమరీందర్ సింగ్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. టీకాలను సరఫరా చేయాలని అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నాకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను సదరు సంస్థ నిరాకరించినట్టు ఆయన తెలిపారు. ‘కంపెనీ పాలసీ ప్రకారం టీకాకు సంబంధించిన లావీదేవీలు, పంపిణీ అంశాలపై భారత ప్రభుత్వంతోనే చర్చలు జరుపుతామని మోడెర్నా స్పష్టం చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమకు వ్యాక్సిన్ డోసులను నేరుగా పంపిణీ చేయాలని కోరిన తమ అభ్యర్థనను ఫైజర్, మోడెర్నా కంపెనీలు నిరాకరించాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. తాము నేరుగా భారత ప్రభుత్వానికే టీకా అమ్మకాలు జరుపుతామని ఆ సంస్థలు చెప్పాయని పేర్కొన్నారు. ‘చేతులు జోడించి వేడుకుంటున్నా. టీకా సంస్థలతో మాట్లాడి వ్యాక్సిన్ను దిగుమతి చేసుకుని.. రాష్ర్టాలకు సరఫరా చేయండి’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు. టీకాల కొరత కారణంగా 400 వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేసినట్టు ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ డోసుల కొరతను తీర్చడానికి రాష్ర్టాలు వేర్వేరుగా గ్లోబల్ టెండర్లకు వెళ్తే.. డిమాండ్, పోటీతత్వం పెరిగి టీకా ధరలు పెరిగే ప్రమాదమున్నదని కేరళ సీఎం పినరాయి విజయన్ అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా కేంద్రమే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి, టీకా డోసులను సేకరించాలని సూచించారు. దీంతో వ్యాక్సిన్ ధరలు దిగివస్తాయన్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అవసరాన్ని బట్టి రాష్ర్టాలకు ఉచితంగా టీకాలను పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వంతో తప్ప, రాష్ట్ర ప్రభుత్వాలతో టీకా విక్రయాలు జరుపడం తమ విధానం కాదని మోడెర్నా, ఫైజర్ కంపెనీలు ప్రకటించాయి.
మోడెర్నా, ఫైజర్ టీకాలను సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందించారు. ఆయా కంపెనీల టీకాలను రెండు మార్గాల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఒకటి.. రెగ్యులేటరీ అనుమతులతో వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకురావడం. రెండోది.. టీకాల విక్రయంపై సదరు కంపెనీలు కేంద్రాన్ని సంప్రదిస్తే, వ్యాక్సిన్ డోసులను సేకరించి వాటిని రాష్ర్టాలకు సరఫరా చేస్తామని అగర్వాల్ తెలిపారు.
ఆర్బీఐ నిధులతో దేశంలోని ప్రజలకు ఉచితంగా టీకాలను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి కేరళ హైకోర్టు సోమవారం సూచించింది. ఒక్కో టీకా డోసును రూ. 150 లేదా రూ. 250 ఖర్చు చేసి సేకరించినప్పటికీ, దేశంలోని 137 కోట్ల మందికి టీకాలు వేయాలంటే రూ. 34 వేల కోట్లు ఖర్చు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నిధులను ఆర్బీఐ కేంద్రానికి ఇచ్చిన రూ. 54,000 కోట్ల డివిడెండ్ నుంచి ఖర్చు చేయవచ్చని అభిప్రాయపడింది. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఆర్బీఐ నిధులను ఖర్చు పెట్టి దేశ ప్రజలను ఆదుకోవాలని గతంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే.