పటాన్చెరు, మే 3 : పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో 70 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని, దవాఖానలో ఆక్సిజన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను ఎమ్మెల్యే సందర్శించారు. దవాఖానలో కొవిడ్ వార్డుని పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఆక్సిజన్ పడకలను సిద్ధం చేసినట్లు ఉద్ఘాటించారు. దవాఖాన ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడంతో పాటు పారిశుధ్య పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. బాధితులు ధైర్యం కోల్పోవద్దని సూచించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ వసుంధర, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.