హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేసి రూ.58.92 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసినట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కరోనాపై దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ పిల్స్లో డీజీపీ, పబ్లిక్హెల్త్ డైరెక్టర్లు వేర్వేరుగా అందజేసిన నివేదికల్లోని అంశాలను పరిశీలించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారని.. డీజీపీ కౌంటర్పిటిషన్లో పేర్కొన్నారు. మాస్కులు పెట్టుకోని 8,417 మందిపై 1,64,467 కేసులు, భౌతికదూరం పట్టని 2,456 మందిపై, గుమిగూడటంపై 322 కేసులు, పాన్, గుట్కా, పబ్లిక్గా మద్యం తాగడంపై 27,023 కేసులు నమోదుచేసి, 62,220 మందిని అరెస్టు చేశారని ఏజీ బీఎస్ప్రసాద్ వివరించారు. వీరినుంచి రూ.58.92 కోట్లు జరిమానాగా వసూలు చేసినట్టు చెప్పారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం కేసుల సంఖ్య పెంచాలని పోలీసులను ఆదేశించింది. కరోనా కట్టడికి ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది.
అంటువ్యాధుల కట్టడికి ప్రభుత్వం వైద్యులతో కూడిన కమిటీలు వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుతామన్న హెల్త్ డైరెక్టర్ హామీని అమలుచేయాలని సూచించింది. సినిమాహాళ్లు, మాల్స్, క్లబ్బులు, వైన్షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. యువతను కట్టడి చేయాలని పేర్కొన్నది. మైక్రో కంటైన్మెంట్, కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేయాలని చెప్పింది. పెండ్లిం డ్లకు 250 మంది దాటకుండా చూడాలని సూచించింది. బంగారం కంటే విలువైన వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వృథా కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలుచేస్తున్నామని, వైరస్కట్టడికి అన్నిస్థాయిల్లో ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు.
ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రెగ్యులర్ కేసుల విచారణను వాయిదా వేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 30 వరకు జ్యుడిషియల్ హియరింగ్లను రద్దు చేసింది. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాలను వ్యక్తిగతంగా లేదా పోస్టుద్వారా తీసుకోవచ్చని కమిషన్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు.