ఎనగండితండాలో అభివృద్ధి పరుగులు
పల్లెప్రగతి ద్వారా మారిన గ్రామరూపురేఖలు
ఇంటింటికీ మరుగుదొడ్డి, మిషన్భగీరథ నీళ్లు
చెత్తడంపింగ్యార్డు పనులు పూర్తి
ఆకట్టుకుంటున్న సీసీరోడ్లు, పల్లెప్రకృతి వనం
చౌటుప్పల్ రూరల్,మే18: మండలపరిధిలోని ఎనగండితండా గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది.గత రెండేండ్ల కింద ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అంతకుముందు సమస్యలకు నిలయంగా ఉండేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. పేరుకే తండా అయినా అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఇక్కడ వందశాతం పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, కొన్ని వీధుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీని సైతం ఏర్పాటు చేశారు. మరికొన్ని డ్రైనేజీలకు తీర్మానాలు చేసి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సీసీరోడ్లు కూడా పూర్తికావొస్తున్నాయి. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైవులా ట్రీగార్డ్స్తో అమర్చిన హరితహారం మొక్కలు, రహదారి వెంబడి లైట్లు, వైకుంఠధామం నిర్మా ణం జరుగుతోంది, పల్లె ప్రకృతి వనం, చెత్తా డంపింగ్ యార్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతినిత్యం ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా నీళ్లు, ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్తో చెత్తను సేకరిస్తున్నారు. దానికి వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి ప్రతి నిత్యం హరితహారం మొక్కలకు నీళ్లు సైతం పడుతున్నారు.
వరంలా పల్లె ప్రగతి
రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో ఈ తండా ముందంజలో ఉంది. గత రెం డేండ్లనుంచి ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.సుమారు 15లక్షలతో తండాలో పక్కాగా ప్రణాళిక తయారు చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రగతి కూడా దీనికి వరంలా మారింది. హరితహారం అమలు పర్చడంలో అగ్రభాగన నిలిచింది. హరితహారంలో భాగంగా 5వేల మొక్కలు నాటారు. దీంతో గ్రామంలో పచ్చదనం ఆకట్టుకుంటోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో తండారూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పచ్చదనం కోసం నర్సరీ సైతం ఏర్పాటు చేశారు. గ్రామంలో సీసీరోడ్లకు ఇరువైవులా పచ్చదనం పరిమళిస్తోంది. గ్రామ ప్రధాన రహదారి వెంబడి పచ్చటి చెట్లు దర్శనమిస్తాయి. రూర్బన్ నిధుల కింద గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.18లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
చేపట్టిన అభివృద్ధిపనులు
తండాలో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.లక్షతో పల్లెప్రకృతివనం నిర్మించారు. రూ.2.25లక్షలతో చెత్త్త డంపింగ్ యార్దు, రూ.8లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించారు. పల్లెప్రగతిలో భాగంగా పనికిరాని చెట్లను తొలగించారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి బ్లీచింగ్పౌడర్ చల్లి వ్యాధులు దరిచేరకుండా ముందస్తు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ తండాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
తండా రూపురేఖలు మార్చాం
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రెండేండ్లలో తండా రూపురేఖలు మార్చాం. నిధులను పక్కాగా ఖర్చుచేస్తున్నాం. ప్రాధాన్యతా ప్రకారం పనులు చేస్తున్నాం. పల్లెప్రగతిలో ప్రతి ఇంటికి తిరిగి పారిశుధ్యంపై అవగాహన కల్పించాం. హరితహారంలో భాగంగా మొక్కలు సైతం విరివిగా నాటాం. నాటిన వాటికి సకాలంలో నీళ్లు పట్టి ట్రీగార్డులు కూడా ఏర్పాటు చేశాం.
-కరంటోతు నర్సింహ్మనాయక్, సర్పంచ్
మంచిగా పనులు చేస్తున్నారు
గ్రామపంచాయతీ అయిన తర్వాత మంచిగా పనులు చేస్తున్నారు. రోడ్ల వెంబడి మొక్కలు నాటి నీళ్లు పడుతున్నారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఇంతకుముందు గ్రామపంచాయతీగా లేనప్పుడు పట్టించుకునేవారే లేకుండే. ఇప్పుడు అడిగిన పనులు చేస్తున్నారు.తండాలో ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తోంది.
-కరంటోతు లాలునాయక్, గ్రామస్తుడు