హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి దూరంగా ఉన్నారని, వీరిని స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఈ నెల 15లోగా ఇంటింటి సర్వే నిర్వహించి, వివరాలను చైల్డ్ ఇన్ఫో, ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్చేయాలని తెలిపారు. 6-14 ఏండ్ల మధ్య వయస్కులు, 15-19 సంవత్సరాల వారిని వేర్వేరుగా గుర్తించి, వెబ్సైట్లో అప్లోడ్చేయాలని వెల్లడించారు. ఒక్కరు కూడా ఔట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉండరాదని, 15లోగా నమోదును పూర్తిచేసి, 16లోగా నివేదికను సమర్పించాలని స్పష్టంచేశారు. కొవిడ్ కారణంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. వలసలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది డ్రాపౌట్లుగా తేలారు. దీంతో వీరందరిని ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా తేల్చిన అధికారులు, వీరిని గుర్తించి నమోదుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.
బడుల్లో నమోదుకాని వారి వివరాలు
6 నుంచి 14 ఏండ్ల మధ్యవయస్కుల్లో మొత్తం 9,113 మంది డ్రాపౌట్లుగా తేలగా, అందులో 4,800 బాలురు, 4,313 మంది బాలికలున్నారు.
15 నుంచి 19 ఏండ్ల మధ్య వయస్కుల్లో మొత్తం 4,276 మంది డ్రాపౌట్లుగా తేలగా, వీరిలో 2,522 మంది బాలురు, 1,754 మంది బాలికలు ఉన్నారు.
ఇప్పటి వరకు 7,623 మందిని గుర్తించి బడుల్లో చేర్పించారు. వీరిలో 4,022 మంది బాలురు, 3,601 మంది బాలికలు ఉన్నారు.
మొత్తం 13,389 మంది డ్రాపౌట్లలో 7,623 మంది బడుల్లో చేరగా, మరో 5,766 మందిని గుర్తించాల్సి ఉంది. ఇందుకోసమే తాజా సర్వేను చేపట్టారు.