హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రముఖ నిర్మాణరంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ముందుకొచ్చింది. హైదరాబాద్లోని పలు దవాఖానలకు ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్లోని డీఆర్డీవోతో మేఘా సంస్థ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. నివ్ దవాఖానలో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 180 నుంచి 500కు పెంచారు. దీనికనుగుణంగా బీ టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (7 వేల లీటర్ల సామర్థ్యం) రోజుకు 50 వరకు అవసరమవుతాయని, ఈ మేరకు సరఫరా చేయాలంటూ నివ్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఇటీవల మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు లేఖ రాశారు. దీంతో నిమ్స్తోపాటు, సరోజినీదేవి కంటి దవాఖానకు 200, అపోలోకు 100, కేర్ హైటెక్కు 50 సిలిండర్లు కలిపి మొత్తం 500 సిలిండర్ల ద్వారా 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ను సరఫరా చేయనున్నట్టు మేఘా సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. భవిష్యత్తు అవసరాలు తీర్చేలా డీఆర్డీవోతో కలిసి 30-40ఆక్సిజన్ ప్లాంట్లను సంస్థ ఏర్పాటుచేస్తున్నది. భద్రాచలంలోని ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ను సేకరించి, దానిని లిక్విడ్ ఆక్సిజన్గా మార్చాలని నిర్ణయించింది.