హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా సెకండ్వేవ్ను ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఒకవైపు వైరస్ను కట్టడి చేస్తూనే మరోవైపు కరోనా సోకినవారికి తక్షణ చికిత్సలు అందించే ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో బెడ్ల కొరత రాకుండా చూస్తున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో కలిపి 53,660 బెడ్లను సిద్ధం చేసింది. ఈ సంఖ్యను వారం రోజుల్లో 60 వేలకు పెంచనున్నది. కరోనా మొదటివేవ్ సమయంలో గతేడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో 18,232 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడునెలల కాలంలో బెడ్ల సంఖ్యను 53,660కి పెంచింది.
ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 65,757గా ఉన్నాయి. వీరిలో ప్రాథమిక లక్షణాలతో హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నవాళ్లే అధికంగా ఉన్నారు. రోజుకు దాదాపు 7వేల మంది వరకు కోలుకుంటున్నారు. దవాఖానల్లో బెడ్ల అవసరం చాలా తక్కువగానే ఉంటున్నది. దీంతో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 4-05 గంటల వరకు 28,362 బెడ్లలో రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 25,292 ఖాళీగా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వినియోగంలో ఉన్న బెడ్లలోనూ 30శాతానికిపైగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి వైద్యసహాయం పొందుతున్నవారే ఉన్నారు. వివిధ దవాఖానల్లో 6,401ఆక్సిజన్ బెడ్లు, 2,865 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
వారంలో మరిన్ని ఆక్సిజన్ బెడ్లు
ప్రభుత్వ దవాఖానల్లో బెడ్ల సంఖ్యను మరింతగా పెంచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 7,580 ఆక్సిజన్, 2,151 ఐసీయూ కలిపి ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సరఫరా అయ్యే బెడ్ల సంఖ్య 9,731. వీటికి అదనంగా వారంలో మరో 5 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. నిమ్స్లో 500, సరోజినీదేవి, గాంధీ, టిమ్స్లో 200, గోల్కొండ, మలక్పేట, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో 100, ఛాతి దవాఖాన, అమీర్పేట ఏరియా దవాఖానల్లో 50 చొప్పున అదనంగా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దవాఖానల్లో బెడ్ల సంఖ్య పెంచడంతోపాటు ఔషధాలు, వైద్యపరికరాల ఏర్పాటు బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియాకు అప్పగించారు. అలాగే కావాల్సిన వైద్య సిబ్బందిని తాత్కాలిక (ఔట్సోర్సింగ్) ప్రాతిపాదికన నియమించుకోవడానికి కలెక్టర్లు అధికారం ఇచ్చారు. దీనిని మానిటరింగ్ చేసే బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావుకు అప్పగించారు.