పచ్చదనం పెంపులో రాష్ట్రం నం.1
హరిత యజ్ఞంలో అంతా పాల్గొనాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
రాష్ట్రవ్యాప్తంగా అటవీ దినోత్సవం
ప్రత్యేక ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ఆరేండ్ల క్రితం వినూత్నంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుత ఫలితాలనిచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం ఆదివారం ఒక సందేశం ఇచ్చారు. మొక్కల పెంపకం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడటమే కాకుండా లక్షల ఎకరాల్లో అంతరించిపోయిన అడవులను పునరుజ్జీవింపచేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని కాపాడటానికి చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకుని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతిపౌరుడు హరితహారం యజ్ఞంలో పాల్గొని రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచడానికి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
పచ్చదనానికి ప్రత్యేక నిధులు:మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
‘హరితహారం’ ద్వారా రాష్ట్రంలో పచ్చదనం విస్తరించి అడవుల శాతం పెరుగుతున్నదని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మరో నాలుగైదేండ్లు కష్టపడితే అటవీ విస్తీర్ణాన్ని అంతర్జాతీయ ప్రమాణాల మేరకు భౌగోళిక విస్తీర్ణంలో 33శాతానికి పెంచడం సులభమవుతుందన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అరణ్యభవన్లో ఆయన మాట్లాడుతూ హరితహారం ద్వారా రాష్ట్రంలో దాదాపు 4% అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో తేలిందని చెప్పారు. మున్సిపాలిటీల్లో పచ్చదనం కోసం 10% ప్రత్యేక నిధులను కేటాయించడం, గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్రెయిలర్, ట్యాంకర్ను కేటాయించడం వల్ల పచ్చదనం పెంపునకు మార్గం సులభమైందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి అంతా కలిసిరావాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రమంతటా అటవీ దినోత్సవం
రాష్ట్రంలో అటవీ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో అటవీశాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో వాహ్యాళికి వచ్చినవారు, సందర్శకుల కుటుంబసభ్యులు, చిన్న పిల్లలతో కలిసి పీసీసీఎఫ్ ఆర్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. భావితరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘జంగల్ బచావో.. జంగల్ బఢావో’ నినాదంతో హరితహారం కార్యక్రమం చేపట్టిందని శోభ తెలిపారు. చిన్నపిల్లల్లో అడవులు, పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందన్నారు. కుటుంబంలో ఏ వేడుక జరిగినా, ఆ సందర్భంగా పిల్లలతో ఒక మొక్క నాటించి, వాటిని పెంచే సంస్కృతిని అలవాటు చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అడవులు, పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల రక్షణకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అడవులకు సమీప గ్రామాల ప్రజలతో అటవీ సిబ్బంది సమావేశమై అగ్ని ప్రమాదాల నివారణ, అటవీ భూముల రక్షణకు అవసరమైన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు అటవీ సంరక్షణ అధికారులు వినయ్కుమార్, ఏకే సిన్హా, హైదరాబాద్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు జోజి, వెంకటేశ్వర్లు, డీసీఎఫ్ లక్ష్మి, డీఎఫ్వో అశోక్, పలువురు అధికారులు పాల్గొన్నారు.