ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్షల వివిధ రకాల మొక్కలు నాటారు. హరితహారంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే ఆరువిడతల్లో 220 కోట్ల మొక్కలు నాటారు. ఏడోవిడతలో నిర్దేశించుకున్న 19.92 కోట్ల మొక్కలను నెల రోజుల్లోనే నాటాలని అధికారులు నిర్ణయించారు. రోజుకు 40 నుంచి 50 లక్షల చొప్పున మొక్కలు నాటి వీలైనంత త్వరగా లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అటు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పనులు ఊపందుకొన్నాయి. – హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ)
గ్రామీణ వ్యవస్థను పటిష్ట పరచడానికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర, జలాల్పూర్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికీ తాగునీరు, గుంట గుంటకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. రాజకీయాలకతీతంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు.
భావితరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటి, సంరక్షించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలోని మంత్రి స్వగ్రామం ఎల్లపెల్లితోపాటు నర్సాపూర్(జి)లో హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. – సోన్
సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని కారేపల్లిలో పంచాయతీ ఆవరణలో మొక్కను నాటారు. – భీమ్గల్
సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మేడ్చల్, డబిల్పూర్లో కలెక్టర్ శ్వేత మొహంతితో కలిసి మంత్రులు మొక్కలు నాటారు. – మేడ్చల్, నమస్తే తెలంగాణ
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లిలో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటిని కూల్చివేయిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్, అధికారులు. – దౌల్తాబాద్
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రెడ్డిపల్లిలో రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగిస్తున్న గ్రామస్థులు – మహముత్తారం
ఇంటికో ఆరు మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తున్న పంచాయతీ సిబ్బంది. – సదాశివపేట
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు మారాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో శుక్రవారం పల్లెప్రగతిలో పాల్గొని, ఇంటింటికీ తిరిగి మొక్కలను పంచారు. అభివృద్ధిలో దండుపల్లి భేష్ అని కితాబిచ్చారు. – మనోహరాబాద్
హరితహారంతో తెలంగాణ గ్రీన్బెల్ట్గా మారిందని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణితో కలిసి మొక్కలు నాటారు. – జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ
పండుగ వాతావరణంలో పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్దనక్కలపేట,
దుబ్బలగూడెం గ్రామాల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. – ధర్మపురి
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల పెద్ద చెరువులో ముదిరాజ్లు చేపలను పట్టి రాశులుగా పోశారు. పెద్దచెరువుకు మత్తడిపోస్తుం డగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 6 టన్నుల చేపలు పట్టి, హన్మకొండ-ములుగు ప్రధాన రహదారిపై విక్రయించారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్