ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ ఆబోతుల వీర్య ఉత్పత్తి కేంద్రం
తోడుగా వీర్య నాణ్యత నిర్ధారణ ల్యాబ్
అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : పశుగణాభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. అప్పుడు నాలుగు ఆబోతుల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రాలుంటే ఆంధ్రాలో మూడు ఏర్పాటు చేసుకుని తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఇచ్చారు. ఆంధ్రాలోని కర్నూలు జిల్లా నంద్యాల, వనవాసిలో, విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే 1982లో తెలంగాణలోని కరీంనగర్లో ఏర్పాటు చేశారు. 1999 వరకు పశుసంవర్ధక శాఖలో ఒక విభాగంగా ఉన్న ఈ కేంద్రం 2000 సంవత్సరం నుంచి పశుగణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఇలాగే కొనసాగుతున్నది. గతంలో ఈ కేంద్రానికి నిధులు ఇవ్వడంలోనూ, ఆబోతులు సరఫరా చేయడంలోనూ అప్పటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. 2014లో తెలంగాణ ఏర్పడే వరకు ఈ కేంద్రంలో కేవలం 44 పశువులు మాత్రమే ఉండేవి. ఒక్కో ఏడాది 9నుంచి 10 లక్షల డోసుల వీర్యాన్ని మాత్రమే ఉత్పత్తి చేసేవారు. గరిష్ఠంగా 11 లక్షల డోసులు దాటింది లేదు.
కానీ, తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేంద్రం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఈ కేంద్రంలో వివిధ జాతులకు సంబంధించిన 92 జాతుల ఆబోతులు ఉన్నాయి. ఏటా 16లక్షల డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సెంట్రల్ మానిటరింగ్ ప్రమాణాల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో సీ గ్రేడ్ దాటని ఈ కేంద్రం ఇప్పుడు ఏ గ్రేడ్లో కొనసాగుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని ఐఎస్వో కూడా ధ్రువీకరించింది. రెండేళ్ల కిందటి వరకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు కూడా ఇక్కడి నుంచి ఆబోతుల వీర్యా న్ని సరఫరా చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం పాడిని విపరీతంగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడి అవసరాలకే సరిపోతున్నది. ఇతర రాష్ర్టాలకు సరఫరా నిలిపివేశారు. ఇప్పుడు ఏటా 20 లక్షల వీర్య డోసులు ఉత్పత్తే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తున్నది. ఉత్పత్తిని పెంచి జాతీ యస్థాయిలో సరఫరా చేసేందుకు ఎన్ఏబీఎల్ లైసెన్స్ కోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
వీర్య నాణ్యత నిర్ధారణ కేంద్రం
రాష్ట్రంలో ఏకైక ఆబోతుల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రం మరో ఘనతను సాధించింది. ఈ కేంద్రానికి అనుబంధంగా 50 లక్షలతో వీర్య నాణ్యత నిర్ధారణ కేంద్రాన్ని గతేడాది ఆగస్టులో కరీంనగర్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. గతంలో నాణ్యత నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నంలో ఉన్న ల్యాబొరేటరీపై ఆధారపడ్డ తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సేకరించిన ఆబోతుల వీర్యం నుంచి ప్రతి నెలా 10 శాతం డోసులను విశాఖపట్నం తీసుకెళ్లి ఇచ్చి రావడం శ్రమతో కూడిన పని కాగా, పరీక్షలు నిర్వహించడంలోనూ అక్కడి ల్యాబ్ నిర్వాహకులు నిర్లక్ష్యం చూపేవారు.
ఆంధ్రాలోని మూడు వీర్య ఉత్పత్తి కేంద్రాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి డోసుకు 60 చొప్పున అక్కడి ల్యాబ్ నిర్వాహకులు వసూలు చేసేవారు. ఈ విధంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు వచ్చేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడే నాణ్యత నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడవుతున్నాయి. అంతే కాకుండా రంగారెడ్డి జిల్లా ఫారుక్నగర్ మండలం కంసాన్పల్లిలో ఏర్పాటు చేస్తున్న మరో ఆబోతుల ఘనీకృత వీర్యోత్పత్తి కేంద్రం కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఏటా 20 లక్షల వీర్యపు డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటు కరీంనగర్లో 20 లక్షలు కలిపి ఏటా 40 లక్షల వీర్యపు డోసులు సేకరణ జరిగితే పశుగణాభివృద్ధి మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉంటా యి. ఈనేపథ్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఆబోతుల ఘనీకృత వీర్య నాణ్యత నిర్ధారణ కేం ద్రం పశుగణాభివృద్ధిలో కీలకం కాబోతున్నది.
ఇవి కూడా చూడండి..
ఆ అమరులకు శిరసు వంచి మొక్కుతున్నా: అమిత్ షా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య