హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్లో గత ఐదేండ్లుగా అద్దె భవనంలో నడుస్తన్నది. ప్రభుత్వానికి అభ్యర్థన పంపిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ జీవో నెంబర్ 93ని జారీ చేసింది.
ఈ జీవోని ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా, రాజ్యసభ సభ్యుల సురేశ్రెడ్డి సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్, ఉపాధ్యక్షుడు గుస్తీ జె. నోరియాకు అందజేశారు. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్కు రావడానికి సహకరించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతులకు ఆ స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షుడు నోరియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.