ఒక్క సీసీ కెమెరా వంది మంది పోలీసులతో సమానం.. ఈ మాటను చాలా మంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పుకొచ్చారు.. కానీ దాని కంటే ఎక్కువగానే ఒక సీసీ కెమెరా పోలీసులకు ఒక ఆయుధంగా మారింది. ఒక సీసీ కెమెరా క్లూ ఇస్తే చాలు.. పోలీసులు వెంటవెంటనే మ్యాపింగ్ వేసుకుని నిందితుల వద్దకు చేరుకుంటారు. ఇలా.. సీసీ కెమెరాలు పోలీసులకు, ప్రజలకు వెన్నంటి ఉండి పూర్తి భద్రతను కల్పిస్తున్నాయి. ఇప్పటికే 90 శాతం కేసుల్లో సీసీ కెమెరాలే కీలకంగా మారినప్పటికీ.. పౌరుల భద్రత, రక్షణలో కూడా సాయపడుతున్నాయి. తాజాగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు కిడ్నాప్ కేసుల్లో సీసీ కెమెరాలే ప్రధాన ఆధారాలను ఇచ్చాయి. దీంతో పోలీసులు ఓ కిడ్నాప్ కేసును 7 గంటల్లో.. మరో దాన్ని 30 గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాలు ప్రాథమిక క్లూ ఇస్తున్నా.. పోలీసులు వాటి విశ్లేషణను సమగ్రవంతంగా చేయడంతో నేరస్తులు గంటల వ్యవధిలోనే దొరికిపోతున్నారు.
హయత్నగర్, ఆర్కే నగర్లో చిత్తుకాగితాలను ఏరుకునే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన ఇంటి పక్కన ఉండే 9 ఏండ్ల బాలికను కేక్ ఇప్పిస్తానని దుకాణానికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి సినిమాకు తీసుకువెళ్లాడు. అప్పటికే సాయంత్రం 7 గంటలు దాటింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగా రు. ఆర్కే నగర్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.. అందులో ఓ సీసీ కెమెరాలో బాలికను తీసుకెళ్తున్న వ్యక్తిని గుర్తించి.. మ్యాపింగ్ వేసుకుని హయత్నగర్, వనస్థలిపురం, నాగోల్, ఇలా పరిసర ప్రాంతాల్లో గాలించారు.. చివరికి వనస్థలిపురంలో ఉన్నట్లు గుర్తించి అక్కడ మొత్తం గాలింపు చేపట్టారు.. అదే సమయంలో సినిమా నుంచి ఆర్కేనగర్ వైపు వచ్చిన వ్యక్తి బాలికను బస్టాండ్ వద్ద వదిలేశాడు. ఆ బాలిక బస్టాండ్లోనే రాత్రంతా నిద్రపోయింది. ఉదయం పోలీసులు బాలికను గుర్తించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విధంగా హయత్నగర్ పోలీసులు మ్యాపింగ్ చేసి గాలింపు చేపట్టగా బాలిక దొరికింది.
సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల కింద ట మధ్యాహ్నం సమయంలో రెండేళ్ల బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్రమత్తమైన పోలీసులు బాలుడు కనిపించకుండా పోయిన కొత్తపేట ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో గుర్తు తెలియని వ్యక్తి డివైడర్ మీద కూర్చున్న బాలుడిని ఎత్తుకుని విజయవాడ బస్టాండ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట, చౌటుప్పల్ వరకు సీసీ కెమెరాలను మ్యాపింగ్ చేశారు. చౌటుప్పల్ వద్ద బాలుడితో గుర్తు తెలియని వ్యక్తి బస్సు దిగి ఓ ఆటో ఎక్కి సర్వేల్ వైపు వెళ్లినట్లు..అక్కడ మరో ఆటోను తీసుకుని సంస్థాన్ నారాయణ్పూర్కు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. ఇలా దాదాపు 70 కిలోమీటర్లు 70 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి బాలుడిని కాపాడారు. బాలుడిని ఎత్తుకువెళ్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటై దాదా పు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం సంయుక్తంగా మొత్తం 1.25 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్లతో పాటు కమాండ్ కంట్రోల్లకు అనుసంధానం చేశా రు. ప్రజలను చైతన్యపర్చి ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు.
సీసీ కెమెరాలు పోలీసులకు ఆయుధంలా తయారయ్యాయి. ప్రతి కేసులో ఇప్పుడు సీసీ కెమెరాలు ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి. నేరస్తులు పట్టుబడడమే కాదు అమాయకులు చిక్కులో పడకుండా కాపాడుతున్నాయి. సీసీ కెమెరాలు కీలకాధారాలను అందించడం ఒక్క ఎత్తయితే.. వాటిని విశ్లేషించి ముందుకు సాగ డం మరో ఎత్తు. మా స్టేషన్ పరిధిలో 3500 సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో చాలా వరకు నేరాలు తగ్గాయి. ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. – సురేందర్, ఇన్స్పెక్టర్ హయత్నగర్