హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఐదు లక్షలు దాటింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి శనివారం వరకు మొత్తం 5.10 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించినవి (బుక్-1) దాదాపు 5.02 లక్షలుగా నమోదయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.3,344 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో సాధారణంగా ప్రతి నెల సగటున 90 వేల నుంచి లక్ష వరకు డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతుంటాయి. సెకండ్వేవ్, లాక్డౌన్ నేపథ్యంలో మే నెలలో ఈ సంఖ్య మూడోవంతుకు పడిపోయింది. ఆంక్షలు తొలిగించిన వెంటనే తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్నది. జూలైలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించి, అదే నెల 22 నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు రిజిస్ట్రేషన్లు పెరుగడంతో అత్యధిక లావాదేవీలు నమోదయ్యాయి.