నీట మునిగి ముగ్గురి మృతి
ప్రాణాలతో ఇద్దరిని కాపాడిన స్థానికులు
వీరిలో ఒకరి పరిస్థితి విషమం
మృతుల కుటుంబాల్లో విషాదం
భద్రాచలం, మార్చి 19: కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వేడుకగా శుభకార్యం నిర్వహించారు.. ఇక నేడో రేపో స్వగ్రామాలకు వెళ్దామనుకున్నారు.. కానీ ఇంతలోనే మృత్యువు ఆహ్వానించిందో ఏమో దుస్తులు ఉతకడానికి గోదావరి తీరానికి వెళ్లారు. ఒకరిని రక్షించబోయి ఒక్కొక్కరుగా నీట దిగారు.. అలా నది ప్రవాహానికి ఐదుగురు గల్లంతయ్యారు.. ముగ్గురు మృత్యువు ఒడికి చేరారు. అదృష్టవశాత్తు స్థానికులు ఇద్దరిని ప్రాణాలతో రక్షించగలిగారు.. భద్రాచలంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆయా కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.
దుస్తులు ఉతకడానికి గోదావరి తీరానికి వెళ్లి ఐదుగురు గల్లంతైన ఘటన శుక్రవారం భద్రాచలంలో జరిగింది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలంలోని అయ్యప్పకాలనీకి చెందిన ఓ పండ్ల వ్యాపారి ఇంట ఈ నెల 17వ తేదీన శుభకార్యం జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి పలువురు హాజరయ్యారు. శుక్రవారం వెలిదిండి వరలక్ష్మి (28), కొడవెల్లి సురేఖ (15), సంతపురి రాంచరణ్ (11), సంతపురి భవానీ, వెలిదిండి వీరబాబుతో పాటు మరికొందరు గోదావరిలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. దుస్తులు ఉతికిన తర్వాత వారు నది అవతల ఒడ్డులో స్నానం చేసేందుకు అవతలి గట్టుకు వెళ్లారు. స్నానం చేసి తిరిగి వస్తుండగా సంతపురి రాంచరణ్ నీటిలో గల్లంతయ్యాడు. తర్వాత బాలుడిని కాపాడటానికి వెలిదిండి వరలక్ష్మి నీటిలో దిగి మునిగిపోయింది. వీరిద్దరినీ కాపాడే క్రమంలో కొడవెల్లి సురేఖ, వెలిదిండి వీరబాబు, సంతపురి భవానీ కూడా నీటిలో గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న వారు కేకలు వేయడంతో స్థానికులు నీటిలో దిగి సంతమూరి భవానీ, వెలిదిండి వీరబాబును కాపాడారు. నీటిలో మునిగి అప్పటికే మృతిచెందిన వెలిదిండి వరలక్ష్మి, కొడవెల్లి సురేఖ, సంతమూరి రాంచరణ్ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలతో బయటపడిన వెలిదిండి వీరబాబును, సంతపురి భవానీని బంధువులు వెంటనే భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో భవానీ పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెలిదిండి వీరబాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ముగ్గురి మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ స్వామి, ఎస్సై సురేశ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నది.
కలెక్టర్ ఎంవీ రెడ్డి దిగ్భ్రాంతి
కొత్తగూడెం, మార్చి 19: భద్రాచలంలోని నీట మునిగి ముగ్గురు మృతిచెందిన ఘటనపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయట పడిన మరో ఇద్దరి ఆరోగ్యంపై వైద్యాధికారులను ఆరా తీశారు. నదిలో లోతు తెలిసే విధంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.