హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం రూ.444.44 కోట్లు విడుదల చేసింది. ప్రతి 15 రోజులకు కూలీల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో తీవ్రజాప్యం జరిగింది. త్వరగా నిధులు విడుదలచేయాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారుల దృష్టికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తీసుకెళ్లి ఒత్తిడి తేవడంతో నిధులు విడుదలయ్యాయి. గతానికి భిన్నంగా ఈసారి సామాజికవర్గాలవారీగా నిధులు విడుదలచేశారు. ఎస్సీలకు రూ.230.96 కోట్లు, ఎస్టీలకు రూ.60.59 కోట్లు, ఇతరులకు రూ.152.89 కోట్లు విడుదలచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6.90 కోట్ల పనిదినాలను కల్పించారు. ఇందులో ఎస్సీలు 1.46 కోట్ల పనిదినాలు, ఎస్టీలు 1.53 కోట్లు, బీసీలు 3.49 కోట్లు, ఇతరులు 41లక్షల పనిదినాలు పనిచేశారు. సగటును ఒక్కొక్కరికి రోజుకు రూ.170 చెల్లిస్తున్నారు.