హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడినప్పటినుంచి గ్రామీణప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.44,270 కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ ఏడేండ్లలో కొత్తగా 78,458 మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.38 లక్షల స్వయంసహాయక సంఘాలున్నాయని, వీటిలో 47.55 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు. 2014-15లో రూ.3,739 కోట్ల బ్యాంకు లింకేజీ రుణం కల్పించగా 2020-21 నాటికి ఈ రుణ పరిమాణం రూ.10,448 కోట్లకు చేరినట్టు తెలిపారు. 2021-22లో రూ.12వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మహిళలను ప్రోత్సహించడానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని, పెద్దఎత్తున వడ్డీలేని రుణాలు అందించాలని ఆదేశించారని ఎర్రబెల్లి తెలిపారు.