హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 45 ఏండ్లు దాటినవారిలో మంగళవారం 41,040 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాల కార్యక్రమం కొనసాగిందని, ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 45 ఏండ్లకు పైబడిన వారు టీకాలు తీసుకున్నారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 41 లక్షలకు చేరుకోగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 6 లక్షలకు చేరుకున్నదని వివరించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కేవలం 0.97% మాత్రమే వృథా అయిందని స్పష్టం చేసింది. మరోవైపు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి తిప్పలు తప్పడం లేదు. ఆన్లైన్లో కొవిన్ సాఫ్ట్వేర్లో టెక్నికల్ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండకపోవటం వల్ల మరికొన్ని సమస్యలు వస్తున్నాయి. దీన్ని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అర్హులకు రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వివరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదేశించారు.