హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అన్ని పూజలకు ఆది దేవుడైన గణనాథుడి లడ్డూల వేలం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. గణపయ్య ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. ఈ సారి మండపాల వద్ద నిర్వహించిన వేలంపాటల్లో మళ్లీ బండ్లగూడ లడ్డూ అధిక ధర పలికి టాప్లో నిలిచింది. 2019లో రూ.18.51 లక్షలకు పాడగా.. ఈసారి ఏకంగా రూ.41 లక్షలు పలికింది. ఈ లడ్డూను రిచ్మండ్ విల్లా సభ్యులు కైవసం చేసుకున్నారు. రెండోస్థానంలో బాలాపూర్ లడ్డూ నిలిచింది. దానిని రూ.18.90 లక్షలకు ఏపీకి చెందిన కడప ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, మర్రి శశాంక్రెడ్డి భాగస్వాములుగా దక్కించుకున్నారు. మూడోస్థానంలో మైహోంభుజ లడ్డూను వ్యాపారవేత్త విజయభాస్కర్రెడ్డి రూ.18.50 లక్షలకు కైవసం చేసుకున్నారు. నాలుగోస్థానంలో బడంగ్పేట లడ్డూ రూ.10 లక్షలు పలికింది. ఈ లడ్డూను రియల్టర్ సురేందర్రెడ్డి సొంతం చేసుకున్నారు. బాగ్లింగంపల్లి యాదాద్రికాలనీలో వక్రతుండాయ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని మండపంలో లడ్డూను అదే కాలనీకి చెందిన ముస్లిం అయిన ముస్తఫా రూ.75,200కు దక్కించుకొని మతసామరస్యాన్ని చాటాడు.