ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉన్న కేసులో ఆరోపణలపై సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే, ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఎన్ఐఏ అధికారులు వాజేను గురువారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనను బలిపశువును చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. తాను ఈ కేసులో ఒకటిన్నర రోజులు దర్యాప్తు అధికారిగా ఉన్నానని, విధిపరంగా చేయాల్సింది చేశానని చెప్పారు. అయితే ఒక్కసారిగా ఏదో మార్పు జరిగిందని, దీంతో తానే స్వయంగా ఎన్ఐఏ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయినట్లు వెల్లడించారు. తాను నేరానికి పాల్పడినట్లు ఎక్కడా ఒప్పుకోలేదని కోర్టుకు తెలిపారు.
కాగా, ఎన్ఐఏ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టులో వాదించారు. ఈ నేరంలో ఒక పోలీస్ పాత్ర ఉన్నట్లు తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారని అన్నారు. దర్యాప్తులో భాగంగా వాజే ఇంట్లో అధికారులు సోదా చేయగా 62 తుపాకీ గుండ్లు లభించాయన్నారు. ఇవి ఆయన వద్ద ఎందుకు ఉన్నాయి అన్నది దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
పోలీస్ శాఖ వాజేకు 30 బులెట్లు ఇచ్చిందని, వీటిలో కేవలం ఐదు మాత్రమే లభించగా మిగతావి మాయమయ్యాయని అనిల్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాజేను ఎన్ఐఏ అధికారులు మరింతగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. వ్యాపారి మన్సుఖ్ హిరెన్ హత్య కేసు నిందితులతో పాటు ఆయనను ప్రశ్నించాల్సి ఉన్నదని కోర్టుకు తెలిపారు. దీంతో వాజే ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది.