మహబూబాబాద్ : కొవిడ్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులో తెచ్చేందుకు కోవిడ్ బ్లాక్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రూ. 68 లక్షలతో నిర్మించిన కోవిడ్ బ్లాక్ భవనాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జడ్పి చైర్మన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ శాసనసభ్యుడు బాణోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం దాత తేజవత్ రామచంద్రు నాయక్ అందించిన రూ.20,86,442 సహాయంతో హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ బెడ్స్, ఇతర వైద్య పరికరాలను మంత్రి సందర్శించి పరిశీలించారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కోవిడ్ దశలో వైద్య సౌకర్యాలు పెంచుకునేందుకు దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు డాక్టర్ల కృషి అభినందించ దగినదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి లాక్ డౌన్ పెట్టడం జరిగిందని, ప్రజలు సహకరించాలన్నారు. స్థానిక శాసన సభ్యులు శంకర్ నాయక్ తన జన్మదినోత్సవం సందర్భంగా అందజేసిన రూ. 5 లక్షలను కోవిడ్ బ్లాక్ కు ఖర్చు చేయనున్నామని తెలిపారు. 40 పడకల ఆసుపత్రిగా నిర్మించడం జరిగిందని, ప్రస్తుతం 30 పడకలను ఆక్సిజన్ తో సమకూర్చడం జరిగిందన్నారు. కోవిడ్ తో ప్రజలు అధైర్య పడరాదని, జిల్లాలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తో పాటు గూడూరు, తొర్రుర్, గార్ల హాస్పిటల్స్ ను అన్ని సౌకర్యాలతో మెరుగు పరచడం జరిగిందని మంత్రి వివరించారు.