హైదరాబాద్, జూన్1: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి ఇప్పటికే అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్తో ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్ బయోటెక్ కంపెనీ బయోలాజికల్-ఈ తాజాగా మరో వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధమయ్యింది. కెనడా కంపెనీ ప్రొవిడెన్స్ థెరపిటిక్స్ అభివృద్ధిపర్చిన ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబొనుక్లిక్ యాసిడ్) వ్యాక్సిన్ ‘పీటీఎక్స్-కొవిడ్-బీ’ను ఇండియాలో తయారుచేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు బయోలాజికల్-ఈ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించిన టెక్నాలజీని బయోలాజికల్-ఈ కి ప్రొవిడెన్స్ బదిలీ చేస్తుందని, 2022లో కనీసం 60 కోట్ల డొసుల్ని ఉత్పత్తి చేయాలని, 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ మహిమా దాట్ల చెప్పారు. తమ ఉత్తర అమెరికా ప్లాంటు నుంచి 3 కోట్ల టీకాల్ని బయోలాజికల్-ఈ, ఇతర కొనుగోలుదార్లకు త్వరలో సరఫరా చేస్తామని ప్రొవిడెన్స్ సీఈఓ బ్రాడ్ సొరెన్సన్ తెలిపారు.