మేడ్చల్, మే 23 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని ఆలయ భూముల వ్యవహారంలో అనేక అక్రమలు జరిగినట్టు తెలుస్తున్నది. ఆలయ భూములు రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఆలయ భూములు ఉన్న సర్వే నంబర్లలో 35 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు విచారణలో నిర్ధారించి ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీకి నివేదిక ఇచ్చినట్టు సమచారం. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ ఆదేశాల మేరకు వివిధ విభాగాల అధికారులు ఆలయ భూముల వ్యవహారంపై చేపట్టిన విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగేండ్లలో ఆలయ భూముల సర్వే నంబర్లలో 35 రిజిస్ట్రేషన్లు జరుగగా, ఇందులో సుమారు 75 నుంచి 100కు పైగా ఎకరాల భూములు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ భూములు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయి? రిజిస్ట్రేషన్లో ఎలాంటి పత్రాలు సమర్పించారు? జత పరిచిన లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ ట్రూ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని పత్రాలను ప్రధాన రిజిస్ట్రార్ ఆఫీస్లో సేకరించనున్నారు.
8 సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు
దేవరయాంజాల్లోని ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు 8 సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగినట్టు విచారణలో తెలింది. శామీర్పేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 23 రిజిస్ట్రేషన్లు కాగా, రిజిస్ట్రేషన్లు ఎక్కడైనా చేసుకొనే అవకాశాన్ని అదునుగా తీసుకొని ఆక్రమణదారులు అనుకూలంగా ఉన్న సబ్రిస్ట్రార్లు విధులు నిర్వహించే ఆఫీసుల్లో పట్టా చేసుకున్నారు. సికింద్రాబాద్, వల్లభాపూర్, బాలానగర్, మల్కాజిగిరి, మహేశ్వరం, కూకట్పల్లిలో మరో 11 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలింది. ఆలయ భూములకు సంబంధించి 91 సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. రాజ్యాభిలేఖనం కార్యాలయం నుంచి సేకరించి పురాతన పహాణీల ఆధారంగా ఆలయ భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లోని లింక్ కాపీలను పహాణీల ఆధారంగా పరిశీలిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నాలుగేండ్లలో రిజిస్ట్రేషన్ అయిన భూములకు సంబంధించి మ్యుటేషన్లు జరిగిన పహాణీలతోపాటు పాస్పుస్తకాలను సేకరిస్తున్నట్టు సమాచారం.
ఏసీబీ పిలుపుతో ఎండోమెంట్లో బుగులు
ఏసీబీ పిలుపుతో ఎండోమెంట్ అధికారులకు బుగులు పుడుతున్నది. దేవరయాంజాల్లోని శ్రీసీతారామచంద్రస్వామి భూముల అన్యాక్రాంతంపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా, తాజాగా ఎండోమెంట్ అధికారులకు ఏసీబీ నుంచి నోటీసులు అందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేసినవారితోపాటు అధికారులందరికీ ఏసీబీ నోటీసులు అందినట్టు తెలిసిం ది. ఈ క్రమంలోనే ఏసీబీ కార్యాలయానికి ఎండోమెంట్ అధికారులు కొందరు వెళ్లివచ్చినట్టు సమాచారం. విడుతలవారీగా రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం మరో కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారుల వివరాలను కూడా సేకరించడంతో పాటు త్వరలోనే వాళ్లకు నోటీసులను జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై కొందరు ఎండోమెంట్ అధికారులను సంప్రదించగా, ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశాలు అందినట్టు ధ్రువీకరించినప్పటికీ.. ఏసీబీ కార్యాలయంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు.