ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలపై సెస్, సర్చార్జీలను పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆదాయం కోల్పోవలసి వస్తున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం పరిమితిని మించి విధిస్తున్న సెస్ల వల్ల రాష్ర్టాలు వేల కోట్ల రాబడిని కోల్పోతున్నాయని వివరించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సెస్ల రూపంలో రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, రాష్ర్టాల ఖజానాకు రూ.1.64 లక్షల కోట్ల మేరకు గండిపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే రూ.3,439 కోట్ల ఆదాయం కోల్పోయిందని వివరించారు. కరోనా సంక్షోభంలో రాష్ర్టాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ర్టాల పరిధిలో ఉన్నవి కేవలం మద్యం, పెట్రోల్ ఉత్పత్తులు మాత్రమేనని వాటిని కూడా జీఎస్టీలోకి చేర్చాలన్న ప్రతిపాదన ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలి
‘దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. 2021-22లో అన్ని రాష్ర్టాల ఆదాయంలో ఆర్థికలోటు సగటున 36.3% ఉండగా, తెలంగాణ ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉన్నది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గి, ఖర్చులు పెరిగాయి. ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి వస్తున్నది’ అని మంత్రి హరీశ్ వివరించారు. ఈ పరిస్థితులలో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3-5% పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఐజీఎస్టీ నిధులు గత ఏడాది రూ.2,638 కోట్లు కేంద్రానికి వచ్చాయని, ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు రూ.13వేల కోట్లు కన్సాలిటేడెట్ ఫండ్కు చేరాయని వివరించారు. ఆ నిధుల నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.218 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక స్థితిగతులు బాగాలేని ఈ పరిస్థితుల్లో, పరిహారం ఇచ్చేందుకు ఇదే చివరి సవంత్సరం అయినందున, రాష్ర్టాలకు పూర్తి పరిహారం, చెల్లించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రేస్కోర్సులు ఉన్న నేపథ్యంలో తెలంగాణకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వాణిజ్యపన్నుల కమిషనర్ నీతూకుమారి పాల్గొన్నారు.