వనపర్తి, మే 25 : మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో రెండో విడుత ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 31వ వార్డులో బృందం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పాజిటివ్ కేసు వచ్చిన వారు విధిగా 14 రోజులు హోం ఐసొలేషన్ లో ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం తిరుపతమ్మ, ఆశవర్కర్ శైలజ, మెప్మా అధికారి యువరాజ్, బాలరాజ్ పాల్గొన్నారు.
గోపాల్పేటలో..
గోపాల్పేట, మే 25 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఇంటి వద్దే చిక్సిత అందించేందుకు మంగళవారం మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆశలు ఇంటింటికీ తిరిగి జ్వర పరీక్షలు చేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కొవిడ్ ఉన్నవారు హోం క్వారంటైన్లో ఉంటూ మందులు వాడే విధానం పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎండీ మతీన్ ఆశలు లత, శ్యామల, రేణుక పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మే 25 : పట్టణంలోని 6, 13, 15 వార్డులో ఇంటింటా జ్వర సర్వేను మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటా సర్వే మంచి ఫలితానిస్తుందని కౌన్సిలర్ రామ్మోహన్రెడ్డి, రవీందర్రెడ్డి అన్నారు. జ్వరం లక్షణాలు ఉన్న వారు సర్వే బృందానికి తెలుపాలని దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఉంటే సర్వే బృందానికి సమాచారం అందించాలన్నారు. అలాంటి వారు స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు ధరిస్తూ పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కౌన్సిలర్ ఖాజమైనొద్దీన్, కోఆప్షన్ సభ్యులు వసీం, కురుమూర్తి దేవస్థానం సభ్యులు శంకర్యాదవ్, అధికారులు బాలయ్య, రవినాయక్, రాజు పాల్గొన్నారు.