హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల కార్మికులకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అన్ని క్యాటగిరీల కార్మికులకు వేతనాన్ని 30 శాతం పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనకు అనుగుణంగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం క్యాజువల్ లేబర్, డైలీ వేజ్ వర్కర్, ఫుల్టైమ్ కాంటింజెంట్ వర్కర్, కన్సాలిడేటెడ్ వర్కర్, పార్ట్టైమ్ వర్కర్లకు వేతనాలు పెరిగాయి. పెరిగిన మొత్తాన్ని జూన్ నెల వేతనంతో కలిపి జూలైలో ఇస్తారు.