కొల్లాపూర్, ఏప్రిల్ 2: మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన ఎంపీటీసీ, సర్పంచ్, మూడు వార్డులకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి సర్పంచ్గా తొలిసారిగా ఎన్నికైన తర్వాత కొన్ని రోజులకు గాదెల సుధారాణి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో సింగవట్నం ఎంపీటీసీ జనరల్ మహిళా స్థానానికి సుధారాణి పోటీచేసి టీఆర్ఎస్ నుంచి గెలిచి ఎంపీపీగా కొంతకాలం కొనసాగిన గాదెల సుధారాణి అనివార్య కారణాలతో రాజీనామా చేసింది. అయితే మాచినేనిపల్లి సర్పంచ్ స్థానానికి, సింగవట్నం ఎంపీటీసీ స్థానం, కుడికిళ్ల పంచాయతీలో ఆరో వార్డు, ఎల్లూరులో ఐదు, ఏడు వార్డులకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. దీంతో కుడికిళ్ల గ్రామ పంచాయతీలోని ఆరో వార్డులో ఉన్న కుటుంబసభ్యులు ఇతర వార్డుల్లో ఉంటే సదరు ఓటర్లను అందరిని ఒకే వార్డులోకి మార్పులు చేస్తూ ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, సహాయకులు మల్లేశ్ శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3న ఓటర్ల ముసాయిదా జాబితాను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నోటీసు బోర్డుపై ప్రచురించనున్నారు. అయితే జాబితాపై ఏమైన అభ్యంతరాలుంటే 8వ తేదీన వాటిని స్వీకరిస్తారు. 12వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు ఎంపీడీవో శేషగిరిశర్మ తెలిపారు.