కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బీజేపీ ప్రచార వాహనం గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో పలు గొర్రెలు మృతి చెందాయి.
కంపా రాములు, అమ్మ రాజయ్య, కంపా సంతోష్ కుమార్ కలిసి 230 గొర్రెలను రోడ్డుపై తీసుకెళ్తుండగా.. ఆ మందపైకి బీజేపీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా, 16 ఏండ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం జమ్మికుంటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రమాదస్థలిని వీణవంక ఎస్ఐ కిరణ్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ గొర్రెల కాపరి రాములుతో పాటు ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. రాములు వైద్యానికి ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను గెల్లు శ్రీను కోరారు.