హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దేశ సరిహద్దులో పాక్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ రాష్ర్టానికి చెందిన ఎన్ఎస్జీ కమెండో కే రాములు ఇంటి నిర్మాణానికి మే 31న రూ.30 లక్షలను మంజూరుచేసినట్టు రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ మొత్తాన్ని శ్రీరాములు బ్యాంకు ఖాతాలో జమచేసినట్టు ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది హరేంద్రప్రసాద్ తెలిపారు. 2016 జనవరి 2న పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదులు దాడిచేయటంతో శ్రీరాములు గాయపడ్డారు. ఆయన జీవన పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ చదివి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్గా పరిగణించి విచారణ చేపట్టింది. 2018 అక్టోబర్ 30న శ్రీరాములుకు 300 గజాల ఇంటి జాగా, ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయంచేస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఎదుట పిల్ మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. శ్రీరాములు పిల్లల విద్యాభ్యాసం కోసం తీసుకొన్న చర్యలను సైనిక్ వెల్ఫేర్ బోర్డును సంప్రదించి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.