ఒప్పందం విలువ రూ.10,547 కోట్లు
ముంబై, మార్చి 4: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో.. బ్రిటన్కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ ‘క్యాప్కో’ను కొనుగోలు చేయబోతున్నది. అమెరికా, యూ రప్, ఆసియా పసిఫిక్ దేశాల్లోని పలు ఆర్థిక సంస్థలకు డిజిటల్, కన్సల్టింగ్, టెక్నాలజీ సేవలను అందజేస్తున్న క్యాప్కోను 1.45 బిలియన్ డాలర్ల (రూ.10,547 కోట్ల)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విప్రో గురువారం వెల్లడించింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్కో.. అంతర్జాతీయ ఆర్థిక సేవల రంగంలోని పలు ప్రముఖ కంపెనీలకు సేవలను అందజేస్తున్నది. బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, వెల్త్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ రంగాల్లోని బిజినెస్ లీడర్లతో గత 20 ఏండ్ల నుంచి కలిసి పనిచేస్తున్నది. కన్సల్టెన్సీ, రెగ్యులేటరీ సేవల్లో ఎంతో ఖ్యాతి పొందిన క్యాప్కో.. ఎనర్జీ, కమాడిటీస్ ట్రేడింగ్ రంగాలకు చెందిన క్లయింట్లకు కూడా సేవలను అందజేస్తున్నది. ఈ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద కన్సల్టింగ్, టెక్నాలజీ, ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థల్లో ఒకటిగా తమ కంపెనీ ఆవిర్భవిస్తుందని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియెర్రీ డెలాపోర్టే తెలిపారు.