నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు నాగార్జున. అందులో బంగార్రాజు కూడా ఉంది. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఐదేళ్ల కిందట వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఇది సీక్వెల్. చాలా రోజుల నుంచి ఈ సినిమా కథ మీద కూర్చున్నా..నాగార్జున సంతృప్తికరంగా లేకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే తాజాగా కళ్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు నాగార్జున.
గతంలోనే కొంతవరకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఆమెతో పాటు సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించిన మరికొందరు నటీనటులు ఇందులో రిపీట్ అవుతున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. అది కూడా ప్రతినాయక ఛాయలున్న పాత్ర కావడం విశేషం. బంగార్రాజులో విలన్ గా ఈమె నటించబోతుందనే వార్తలొస్తున్నాయి.
నాగార్జునకు ధీటైన ప్రతినాయకురాలిగా ఈ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. నరసింహాలో నీలాంబరి తరహా పాత్ర ఇది అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున కూడా ఈ పాత్ర కోసం భూమికనే రిఫర్ చేసాడని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి స్నేహమంటే ఇదేరా సినిమాలో నటించారు. అది ఫ్లాప్ అయింది.. ఇన్నేళ్ళ తర్వాత కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. మొత్తానికి చూడాలిక..స్క్రీన్ పై భూమిక విలనిజం ఎలా ఉండబోతుందో..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.