ఆరోగ్య తెలంగాణ సాధనకు కృషిచేయాలని పిలుపు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనకు ప్రజలందరూ కృషిచేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతోపాటు ఇతర నివారణ పద్ధతులను పాటించాలని విజ్ఞప్తిచేశారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమిళిసై సోమవారం అక్కడి నుంచి హైదరాబాద్ రాజ్భవన్లోని ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఐదుగురిలో ఒకరిని కొవిడ్ బాధితులుగా మనం భావించుకొని మహమ్మారి మరింత ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చిన్నారులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని, పిల్లల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ యాంటీ కొవిడ్ మందు గేమ్ చేంజర్గా నిలిచి సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా గవర్నర్ తన కార్యదర్శి కే సురేంద్రమోహన్కు సూచించారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు, కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ తీరు, టెస్టులు, పాజిటివ్ కేసులు, రికవరీ కేసుల సంఖ్య తదితర అంశాల గురించి సురేంద్రమోహన్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు.