హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, వైరి వర్గం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడన్న కారణంతో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్..అజర్కు తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు అజర్.. హెచ్సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల్లోగా షోకాజ్ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే అసోసియేషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనూరాధా సంతకాలతో అపెక్స్ కౌన్సిల్ అజర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 లీగ్లో బీసీసీఐ అనుమతి లేకుండా ఓ జట్టుకు మెంటార్గా వ్యవహరించడం, అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ విషయంలో స్పష్టత లేని వైనం, హెచ్సీఏకు చెందిన ఆర్థిక వ్యవహారాలను అడ్డుకోవడం, అంబుడ్స్మన్గా జస్టిస్ దీపక్వర్మను నియమిస్తూ వేతనాన్ని నిర్ణయించడాన్ని అపెక్స్ కౌన్సిల్ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.