హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/ చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారు ఎయిర్బ్యాగులో ఉంచి రవాణా చేస్తున్న 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.11.63 కోట్లు ఉంటుందని తెలిపారు. అసోం రాజధాని గుహవాటి నుంచి హైదరాబాద్కు పెద్దఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు విజయవాడ- హైదరాబాద్ హైవేపై పంతంగి టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. అసోం రిజిస్ట్రేషన్తో ఉన్న కారును తనిఖీ చేయగా 25 కిలోల బంగారం దొరికింది. కారు ముందుసీటులో ప్యాసింజర్ కోసం ఉండే లైఫ్ సేవింగ్ ఎయిర్బ్యాగ్ను తొలగించి దానిస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. అందులో ఒక్కో కిలో చొప్పున ఉన్న 25 బంగారం బిస్కెట్లను దాచి.. పైనుంచి ఫెవీక్విక్తో సీల్ చేశారు. పట్టుబడిన బంగారం బిస్కెట్లు అన్నీ విదేశాలకు చెందినవేనని, వీటిలో హీరెస్, సుస్సీ, మెల్టర్ అస్సాయెర్, వాల్కంబీ అనే నాలుగు విదేశీ కంపెనీల మార్క్తో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మరో 55 కిలోమీటర్లయితే
గుహవాటి నుంచి హైదరాబాద్కు బంగారాన్ని రవాణా చేసేందుకు నిందితులు కారులో ఏకంగా 2,500 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో 55 కిలోమీటర్లు వెళితే హైదరాబాద్ వస్తుందనగా డీఆర్ఐ అధికారులకు చిక్కారు. రూ.11.63 కోట్ల విలువచేసే 25 కిలోల బంగారంతోపాటు రూ.25 లక్షల విలువైన ఇసుజు కారును స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్1962 కింద నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని డీఆర్ఐ అడిషనల్ డీజీ డీపీ నాయుడు తెలిపారు.