ఏ పూజనైనా ప్రారంభించే ముందు ‘ప్రాణాయామం’ చేస్తాం. ముక్కుతో సహా శ్వాసకోశాలకు చెందిన సమస్త అవయవాలూ దీనివల్ల శుద్ధినొందుతాయి. భగవంతునిపైన ధ్యాసను లగ్నం చేసేందుకు ప్రాణాయామాన్ని మించిన ప్రక్రియ లేదు. పూజలో ప్రాణాయామమూ మంత్రసహితంగానే ఉంటుంది. పూజ చేయించే బ్రాహ్మణుడు మనలను ముక్కు పట్టుకొమ్మంటాడు. ఆయన మంత్రం చదువుతాడు. మంత్రోచ్ఛారణతో పాటు క్రియ జరుగుతుంటుంది. ప్రాణాయామాన్ని ఇలా లాంఛనంగా మాత్రమే చేస్తే మంత్ర ప్రయోజనం నెరవేరదు.
ఈ ప్రాణాయామం గాయత్రీ ఛంద సహితం. ‘ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓ జనః ఓం తపః ఓగ్ం సత్యం..’ మంత్రం ఇక్కడికి వచ్చేవరకు ఎడమ ముక్కు గుండా గాలిని పీల్చుకొంటూ ఉండాలి. కుడి ముక్కును మూసి ఉంచాలి. పూజ చేయించేప్పుడు మంత్రాన్ని బ్రాహ్మణుడు చదువుతాడు కనుక, మనం మౌనంగా క్రియ చేసుకోవచ్చు. ‘ఓం తత్స వితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్..’ అన్న మంత్ర భాగాన్ని చదివేప్పుడు మనం ఎడమ ముక్కును మూసుకొని కుడిముక్కుతో గాలిని వదలాలి. ఉచ్ఛాస, నిశ్వాసలు మంత్రానికి సమాంతరంగా ఉండాలి. ‘మంత్రం దారి మంత్రానిదే, మన దారి మనదే’ అన్నట్లు ఉండకూడదు. ‘ఓమాపోజ్యోతీ రసోమృతమ్ బ్రహ్మ భూర్భువస్సువరోమ్’ అన్న మంత్ర భాగాన్ని చదివేప్పుడు తిరిగి కుడి ముక్కుతోనే గాలిని పీల్చుకోవాలి. దీనితో ప్రాణాయామం పూర్తవుతుంది. పూజ ముందుకు సాగుతుంది.
ఎడమ ముక్కుతో గాలిని పీల్చుకునేటప్పుడు చెప్పబడే మంత్రంలో ఉన్నవి ఏడు ఊర్ధ లోకాల పేర్లు. భూమి ఊర్ధ లోకాలలో అన్నిటికన్నా అడుగున ఉన్నది. సత్యలోకం అన్నిటికన్నా పైది. మన సూక్ష్మ శరీరాంశ హంసరూపం ధరించి మంత్రాన్ని ఆసరాగా చేసుకొని భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలను సావకాశంగా దర్శిస్తూ సత్యలోకాన్ని చేరుకోవాలన్నమాట. ప్రతి లోకం పేరుకు ముందు ‘ఓం’ వస్తుంది. ‘ఓంకారం’ ప్రణవం. ‘ప్రణవం’ అంటే ‘శక్తి’. ప్రణవాన్ని మించిన శక్తి విశ్వంలో లేదు. మనం ఉచ్చరించిన ‘ఓం’ అన్న ప్రాణశక్తి కారణంగా మనలోని హంస ఒక్కొక్క లోకాన్ని దాటుతూ సత్యలోకం చేరుతుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టాక మన భవిష్య జీవనం ఏ లోకంలో ఉండాలో ఎంచుకునేందుకు మహర్షులు మనకొక అవకాశాన్ని ఈ రకంగా ఇస్తున్నట్టు దీనిని అర్థం చేసుకోవాలి. స్థూలదేహం సజీవంగా కిందనే ఉండిపోయింది కాబట్టి, సూక్ష్మ దేహాంశ తిరిగి భూలోకానికి రావాలి. ఏడు లోకాల ఎత్తునుండి కిందకు దూకడం సాధ్యం కాదు కాబట్టి, సూక్ష్మ దేహాంశ సవితృశక్తిని ఆధారంగా చేసుకొని అంటే ‘గాయత్రీ మంత్రసాయం’తో భూమిపైకి దిగుతుంది. అత్యంత వేగంతో కిందకు దిగిన సూక్ష్మ దేహాంశ భూమిమీద స్థూల దేహంలో ఆగి, నిలదొక్కుకోవడం కష్టమవుతుంది.
కనుక, ‘ఓమాపో జ్యోతీ రసోమృతమ్ బ్రహ్మ భూర్భువస్సువరోమ్’ అన్న మంత్రసాయంతో భూలోకాన్నుంచి భువర్లోకానికి, అక్కడినుంచి సువర్లోకానికి వెళ్లి ఆగిపోతుంది. ‘సువర్లోకం’ అంటే ‘స్వర్గం’. దేవతల నివాస స్థానం. సాయుజ్యాన్ని ప్రసాదించే పరమాత్మ తప్ప, మనం పూజించే దేవతలందరూ నివాసం ఉండేది అక్కడే. మనం చేసే నిత్య నైమిత్తిక పూజలన్నీ కామనలతో కూడుకున్నవే. పూజ జరిగినంతసేపూ ‘మన సూక్ష్మ దేహాంశ, మరింత సరళంగా చెప్పుకోవాలంటే, మన మనసు సువర్లోకంలో దేవతల మధ్య శ్రద్ధాభక్తులతో విహరిస్తూ ఉండాలన్నది’ పూజలోని ప్రాణాయామ లక్ష్యం. పూజ చివర పూజారి మన చేత అక్షతల నీళ్లను వదలి పెట్టించేంత వరకు మనం సువర్లోకంలోనే ఉండగలిగితే దేవుళ్లు మన కోరికలను నెరవేర్చకుండా ఉండగలరా!
వరిగొండ కాంతారావు 94418 86824