ఇక ప్రజారోగ్య వ్యవస్థ మరింత పటిష్ఠం
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఒకేసారి 2,418 మంది స్టాఫ్ నర్సులు విధుల్లో చేరబోతున్నారు. ఇటీవలే ఉద్యోగాలు పొందిన వీరందరికీ పోస్టింగ్ ఆర్డర్లు అందుతున్నాయి. ఇది పూర్తయితే వైద్యారోగ్యశాఖ మరింత బలోపేతమవుతుం ది. మొత్తం 3,311 పోస్టులకు 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి 2018 మార్చిలో పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టులకు కల్పించిన వెయిటేజీపై కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో భర్తీప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఇటీవల కోర్టు నుంచి స్పష్టత రావడంతో ఈ ఏడాది టీఎస్పీఎస్సీ మెరిట్ లిస్టు విడుదల చేయగా, వైద్యారోగ్యశాఖ కౌన్సిలిం గ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ విడుదలచేసింది. దీంతో ఇప్పటికే తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 803 మందికి నియామక ఉత్తర్వులు వెళ్లాయి. డైరెక్టర్ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని 1,615 మందికి ఒకటి రెండు రోజుల్లో ఆర్డర్స్ అందనున్నాయి. వీరంతా వారంలోగా విధుల్లో చేరనున్నారు. ఉద్యోగాలు పొందినవారిలో 1,200 మందికిపైగా కాంట్రా క్టు నర్సులు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఎనిమిదేండ్ల కల నెరవేరింది
ప్రభుత్వ దవాఖానలో పనిచేయాలన్నది నా స్వప్నం. 8 ఏండ్లపాటు కాంట్రాక్టు నర్సుగా పని చేశా. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే దరఖాస్తుచేసి పరీక్ష రాశాను. వెయిటేజీ కలిసొచ్చి ఉద్యోగం రావడంతో కల నెరవేరింది. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు సేవలందించేందుకు ఉద్యోగంలో చేరబోతున్నా.
-ధారావత్ నీలిమ, స్టాఫ్నర్స్, దేవరకొండ