ఇంట్లో నుంచి వెళ్లి హత్యకు గురైన కాంట్రాక్టర్
పోలీసుల అదుపులో ఇద్దరు?
చర్లపల్లి, మే 14 : ఇంటి నుంచి బయటకు వెళ్లి అదశ్యమైన ఓ కాంట్రాక్టర్.. హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి చెరువులో పడేశారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీకి చెందిన ఆముదాలపల్లి రామ్మూర్తి(61) స్థానికంగా బిల్డింగ్ కాంట్రాక్టర్. కాగా.. ఈనెల 10న కుషాయిగూడలోని శ్రీకాంత్ అనే వ్యక్తిని కలువడానికి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోగా.. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెంది కుటుంబ సభ్యుల్లో ఒకరైన కొత్తపేటకు చెందిన అద్దంకి శ్రీనివాస్ కుషాయిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదృశ్యం అయినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 13న నాగారంలోని అన్నారం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా రామ్మూర్తిదిగా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతోపాటు చేతులు కట్టేసి ఉండటంతో హత్యగా భావించి.. ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా.. కుషాయిగూడ, వాసవీనగర్కు చెందిన శ్రీకాంత్, శ్రీనివాస్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ మన్మెహన్ సందర్శించి.. వివరాలు తెలుసుకున్నారు.