హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలతో పంచాయతీరాజ్ విభాగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాల వల్ల పలు పంచాయతీరాజ్ రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 1,058 పనులకు రూ.230 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జూలైలో రూ.98 కోట్లు, ఆగస్టులో రూ.132 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. 372 రోడ్లకు రూ.96 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. 257 చోట్ల గండ్లు పడిన రోడ్ల మరమ్మతులకు రూ.18 కోట్లు, 429 క్రాస్ డ్రైనేజీ పనులకు రూ.116 కోట్లు, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని 18 భవనాల మరమ్మతులకు రూ.2.41 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వీటిని త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.