సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఎత్తివేస్తూ శనివారం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు బోసి పోయిన నగర రోడ్లపై ఆదివారం నుంచి సిటీ బస్సులు సందడి చేయనున్నాయి. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు పూర్తి స్థాయిలో తిప్పడానికి ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈడీ వీ. వెంకటేశ్వర్లు తెలిపారు. జీహెచ్ఎంసీ జోన్లో 2,400 సిటీ బస్సులను తిప్పడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా విధుల్లోకి ఆరోగ్యవంతమైన డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే తీసుకుంటామని,కరోనా లక్షణాలు ఉన్న వారిని విధుల్లోకి తీసుకోమన్నారు. ప్రతి రోజూ బస్సులను శానిటైజేషన్ చేస్తామన్నారు. ప్రయాణికులు కూడా తప్పకుండా మాస్కులు ధరించి బస్సులు ఎక్కాలని ఆయన సూచించారు.
సిటీ బస్సుల్లో నిత్యం ప్రయాణం చేసే వారి కోసం నగరంలో ఏర్పాటు చేసిన 37 కేంద్రాల్లో బస్సు పాసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే జూలై 1 నుంచి విద్యా సంస్థలు తెరువనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.