చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేశారు. సంతోష్ అనే వ్యక్తి తంజావూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా, నియోజకవర్గం దృష్టిని ఆకట్టుకునేందుకు పుచ్చకాయతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కేటాయించిన పుచ్చకాయ గుర్తుపై పోటీ చేయడం ఇది నాలుగోసారని సంతోష్ తెలిపారు. తొలిసారి పోటీ చేసినప్పుడు వంద ఓట్లు వచ్చాయని, గత ఎన్నికల్లో 400కుపైగా ఓట్లు తనకు పోలైనట్లు చెప్పారు. ఈసారి పది వేలకుపైగా ఓట్లు రావచ్చని, ప్రజలు మద్దతిస్తే తాను గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు.
మార్పు రావాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, అయితే తమలాంటి స్వతంత్ర అభ్యర్థులతోనే మార్పు సాధ్యమని సంతోష్ తెలిపారు. ప్రజలు తమకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రచారానికి తన వద్ద డబ్బులు లేవని, అందుకే తన గుర్తు అయిన పుచ్చకాయతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కర్ ఇటీవల నామినేషన్ సందర్భంగా డిపాజిట్ డబ్బులను రూ.20 నోట్లలో చెల్లించారు. మీడియా దృష్టికి ఆకట్టుకునేందుకు ఆయన ఇలా చేయగా, ఆ నోట్లను లెక్కపెట్టేందుకు అధికారులు ఇబ్బందిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.