పెండింగ్ పనులను పూర్తి చేయాలి
సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.217 కోట్లను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదలచేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కొవిడ్ బాధితులకు హోంఐసొలేషన్ వసతి లేకపోతే స్థానిక ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చాలని సూచించారు. సోమవారం బంజారాహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో తన శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నివారణ చర్యలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దాతల సహకారంతో ఐసొలేషన్ కేంద్రాల్లోని రోగులకు ఆహారం, పండ్లు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించాలని మంత్రి కోరారు. ఆరోగ్య సర్వేలో ఆశవర్కర్లతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి సర్వే విజయవంతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. కరోనా కష్టకాలంలోనూ ఆసరా పింఛన్లకు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.1,554 కోట్లతో 12,270 వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా.. 11,250 పూర్తయ్యాయని, 1,470 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కరోనా దృష్ట్యా పూర్తయిన వైకుంఠధామాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం మొక్కలు ఎండిపోకుండా 100 శాతం సంరక్షించడానికి సర్పంచులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు, పీఆర్ ఈఎన్సీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.