హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేలా ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకున్నది. జూన్, జూలై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల రేషన్బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో 15 కేజీలు, జూలైలో 5 కేజీలు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో పది కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న పది కిలోలకు అదనంగా మరో పది కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఆహారభద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎప్పటిలాగే ఇచ్చే ఆరు కిలోలకు మరో తొమ్మిది కలిపి 15 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. వచ్చే నెల ఇచ్చే బియ్యంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 87.42 లక్షల రేషన్ కార్డుదారులైన 2.79 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు.