న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో జీడీపీ వృద్ధిరేటును ప్రపంచ బ్యాంకు కుదించి వేసింది. ఈ ఏడాదిలో వృద్ధిరేటు 8.3 శాతానికి మాత్రమే పరిమితమని పేర్కొంది. ఇంతకుముందు అది 10.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థతోపాటు సర్వీసుల రంగాలను కరోనా రెండో వేవ్ పూర్తిగా దెబ్బ తీసిందని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది.
గ్లోబల్ ఎకానమీ 5.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. 2019లో భారత ఎకానమీ వృద్ధిరేటు 4 శాతంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. 2022-23లో 6.5 శాతానికి చేరొచ్చునని అంచనా వేసింది.
ఇటీవలే దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా జీడీపీ గ్రోత్ రేటును తగ్గించి వేసింది. తొలుత 11 శాతంగా వృద్ధిరేటు రికార్డవుతుందని పేర్కొన్న క్రిసిల్.. తర్వాత 9.5తో సరిపెట్టింది.
కరోనా రెండో వేవ్ కేసులు పెరగడంతో ప్రయివేట్ వినియోగంపైనా, ఇన్వెస్ట్మెంట్లపైనా ప్రతికూల ప్ఱభావం పడిందని క్రిసిల్ వ్యాఖ్యానించింది. ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా ప్రపంచ బ్యాంక్, క్రిసిల్ బాటలోనే పయనించింది.
2022 మార్చి నెలాఖరుతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదు కావచ్చునని మూడీస్ అంచనా వేసింది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది.